అందుకే, ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల విధానం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వతంత్ర ఎన్నికల కమిషన్తోనే ఇది సాధ్యమంది. స్వతంత్రంగా కనిపిస్తేనే చాలదు. అది కచ్చితంగా స్వతంత్రంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై ఆఖరు రోజు గురువారం వాదనలు కొనసాగాయి.
ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ సిఫారసు మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాల్సి ఉంటుందంటూ కేంద్రం సవరించిన నిబంధనలు 2024 జనవరిలో అమల్లోకి వచ్చాయి. ఈ త్రిసభ ఎంపిక కమిటీలో అంతకుముందున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రభుత్వం చేర్చింది. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పైవ్యాఖ్యలు చేసింది. అయితే, ఈసీ నియామకాల విషయంలో పార్లమెంట్కు పూర్తి అధికారముందని, న్యాయ వ్యవస్థ జోక్యం తగదని అటార్నీ జనరల్ వెంకటరమణి గట్టిగా వాదించగా ఈ విషయంలో ‘మా లక్ష్మణ రేఖ ఏమిటో మాకు తెలుసు. మేం ఎన్నటికీ ఆ గీత దాటము’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


