
సాక్షి,న్యూఢిల్లీ: ఒక్కో విమాన ప్రయాణం వెనుక ఉన్న భద్రతా ప్రమాణాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఎయిరిండియా బోయింగ్ 787 విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఈ విమానాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. సాంకేతిక సమస్యల్ని పరిష్కరించే వరకు వాటి రాకపోకల్ని నిలిపి వేయాలని కోరింది.
ఆ లేఖలో.. విమానాన్ని నియంత్రించడంలో కీలకమైన భాగం కంట్రోల్ స్టిక్.. బోయింగ్ 787 విమానాల్లో ‘కంట్రోల్ స్టిక్’సమస్యలు ఉన్నాయని పేర్కొంది. విమాన నియంత్రణలో అంతరాయం కలిగించే ఈ లోపం, ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. అయినప్పటికీ ఎయిరిండియా నిర్వహణ విభాగం ఈ సమస్యను తేలికగా తీసుకుంటోందని విమర్శించింది.
ఇందులో భాగంగా బోయింగ్ 787 విమానాలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరింది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా సాంకేతిక పరిశీలన పూర్తయ్యే వరకు ఈ విమానాలను ఆపాలని భారత పైలెట్ల సమాఖ్య స్పష్టం చేసింది.