
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిట్టిపొట్టి బొమ్మలు, బాలల కథల సంపుటితో బుజ్జాయిగా బహుళ ప్రాచుర్యం పొందిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో ప్రముఖ రచయిత, కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు 1931 సెప్టెంబర్ 11న ఆయన జన్మించారు. బుజ్జాయి అనే కలంపేరుతో ఫ్రీలాన్స్ కార్టూనిస్టుగా, చిన్నపిల్లల కథారచయితగా ప్రసిద్ధి చెందారు.
ఆయన బొమ్మల కథల్లో ‘డుంబు’ చిన్నారులను బాగా అలరించింది. అలాగే ‘పంచతంత్ర’ ధారావాహిక కథలు ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో 1963–68 వరకు ప్రచురితమయ్యాయి. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మలద్వారా పాఠకులకు పరిచయం చేశారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పలు రచనలకు అవార్డులు అందించాయి.