ఇక సీబీఐ వంతు! | Delhi High Court stays trial court order granting bail to Arvind Kejriwal in Excise policy case | Sakshi
Sakshi News home page

ఇక సీబీఐ వంతు!

Jun 26 2024 3:17 AM | Updated on Jun 26 2024 3:17 AM

Delhi High Court stays trial court order granting bail to Arvind Kejriwal in Excise policy case

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను బుధవారం సీబీఐ అరెస్టు చేసే అవకాశం కని్పస్తోంది. సీబీఐ వర్గాలు మంగళవారం తిహార్‌ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ చర్య ప్రధాని మోదీ కక్షసాధింపులో భాగమేనని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ ఆరోపించారు. అందుకే కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో ఇరికించారన్నారు.

ఢిల్లీ హైకోర్టులో నిరాశే
మనీ లాండరింగ్‌ కేసులో బెయిల్‌ విషయంలో కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్‌ బెయిల్‌పై మధ్యంతర స్టే ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సుధీర్‌కుమార్‌ జైన్‌ నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. వాదనలకు ఈడీకి ట్రయల్‌ కోర్టు సమయమివ్వలేదని ఆక్షేపించింది.

కేజ్రీవాల్‌ ప్రమేయంపై సమర్పించిన పత్రాలను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో, క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమైందని స్పష్టంచేసింది.కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరుపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీకి తగిన సమయమిచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బెయిల్‌ ఉత్తర్వుపై స్టేను రద్దు చేయడం లేదని తేచ్చిచెప్పారు. కేజ్రీవాల్‌కు ఈ నెల 20న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

దీన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఆ మర్నాడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు. దాంతో ఆయన కనీసం మరిన్ని రోజులపాటు తిహార్‌ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement