కార్ పూలింగ్, ఆఫీస్ వేళల్లో మార్పులు
ఇంధన పొదుపులో భాగంగా ప్రైవేట్ సంస్థలకు ఢిల్లీ ప్రభుత్వ సలహా
న్యూఢిల్లీ: ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపు ప్రయత్నాలను చేపట్టింది. ప్రైవేట్ కంపెనీలు రెండు రోజుల వర్క్–ఫ్రమ్–హోమ్ విధానాన్ని అమలుచేయాలని, ఆఫీసు పనివేళలను మార్చుకోవాలని, ఉద్యోగులు కార్ పూలింగ్, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఢిల్లీ కార్మిక శాఖ ఆదివారం అడ్వైజరీని జారీ చేసింది.
వర్క్–ఫ్రమ్–హోమ్ వల్ల ఇంధన వినియోగాన్ని పెద్ద మొత్తంలో నివారించవచ్చని పేర్కొంది. ‘జాతీయ ఇంధన పొదుపు ప్రయత్నాలకు తోడ్పడేందుకు, ఢిల్లీలోని ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, పారిశ్రామిక సంస్థలు, కర్మాగారాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థల యజమానులందరూ వారానికి కనీసం రెండు రోజుల పాటు వర్క్–ఫ్రమ్–హోమ్ను అమలు చేయాలి. రద్దీ సమయాల్లో రహదారులపై వాహనాల భారాన్ని తగ్గించడానికి విడతల వారీగా పని గంటలను అమలు చేయాలి. ఉద్యోగులను ప్రజా రవాణా, కార్–పూలింగ్ లేదా మోటారు రహిత ప్రయాణ మార్గాలను ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలి’ అని అడ్వైజరీలో సూచించింది.
ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సంస్థలు, విద్యుత్, నీరు, పారిశుధ్యం, సంబంధిత మున్సిపల్ సేవలు వంటి అత్యవసర ప్రైవేట్ సంస్థలకు మినహాయింపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత కారణంగా వనరులను తెలివిగా ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు ఇంధన పొదుపు కార్యక్రమాలకు మద్దతివ్వాలని ప్రైవేట్ రంగాన్ని కోరనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ఆమె 90 రోజుల ‘మేరా భారత్, మేరా యోగ్దాన్’ఇంధన పొదుపు ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.


