రాష్ట్రానికి కోవిడ్‌ సాయం రూ.353 కోట్లు  | Central Govt Released 353 Crore To Telangana For Covid-19 challenges | Sakshi
Sakshi News home page

అత్యవసర ప్యాకేజీ వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం 

Feb 6 2021 8:24 AM | Updated on Feb 6 2021 8:53 AM

Central Govt Released 353 Crore To Telangana For Covid-19 challenges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కోవిడ్‌ నియంత్రణకు అత్యవసర ఆర్థిక ప్యాకేజీ కింద అధికంగా సొమ్ము పొందిన రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.6,309.9 కోట్ల ఆర్థిక సాయం అందజేసింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద విడుదల చేసిన ఈ సొమ్ములో అత్యధికంగా తమిళనాడుకు రూ.773.24 కోట్లు, తర్వాత ఢిల్లీకి రూ.651.46 కోట్లు, మహారాష్ట్రకు రూ.592.82 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.474.78 కోట్లు, కేరళకు రూ.453.56 కోట్లు, తెలంగాణకు రూ.353.13 కోట్లు సాయం అందింది. అత్యంత తక్కువగా లక్షద్వీప్‌కు రూ.40 లక్షల సాయం లభించింది.  

1,400 వెంటిలేటర్లు.. 
దేశవ్యాప్తంగా 36,651 వెంటిలేటర్లను సరఫరా చేయగా, అందులో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 1,400 వెంటిలేటర్లను అందజేసింది. అత్యధికంగా ఏపీకి 4,960, మహారాష్ట్రకు 4,434, ఉత్తరప్రదేశ్‌కు 4,016 వెంటిలేటర్లను సరఫరా చేసింది. దేశవ్యాప్తంగా 1.02 లక్షల ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేయగా, అందులో 1,000 తెలంగాణకు వచ్చాయి. అత్యధికంగా మహారాష్ట్రకు 22,064 ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేశారు. తెలంగాణకు ఎన్‌–95 మాస్క్‌లు 14.85 లక్షలు, పీపీఈ కిట్లు 2.81 లక్షలు, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు 42.5 లక్షలు కేంద్రం సరఫరా చేసింది. అలాగే రాష్ట్రానికి 91,100 ట్రూనాట్‌ కోవిడ్‌ టెస్ట్‌ కిట్లను, 5.84 లక్షల ఆర్‌టీపీసీఆర్‌ కిట్లను అందజేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement