
బెంగళూరు: ఆర్సీబీ జట్టు విజయోత్సవాల మాటేమోగానీ.. 11 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో తన ఒక్కగానొక్క కొడుకును పొగొట్టుకున్న తండ్రి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కొడుకు శవానికి పోస్ట్మార్టం వద్దని, అలాగే అప్పగించాలని వేడుకుంటూ మాట్లాడిన మాటలవి.
‘‘నాకు ఒక్కగానొక్క కొడుకు. 22 ఏళ్లు గారాభంగా పెంచుకున్నా. నాకు చెప్పుకుండా ఇక్కడికి వచ్చి వాడు ప్రాణం పొగొట్టుకున్నాడు. సీఎం, డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరొచ్చి పరామర్శించినా నా కొడుకును బతికించలేరు. దయచేసి వాడి శరీరాన్ని ముక్కలు చేయకండి. అలాగే అప్పగించండి. మీకు దణ్ణం పెడతా..’’ అంటూ మీడియా ముఖంగా ఆయన కన్నీళ్లతో చేసిన అభ్యర్థన పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
Credits: NDTV
అయితే అధికారులు ఆయన విజ్ఞప్తికి ఎలా స్పందించారనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తొక్కిసలాట మృతదేహాలకు ఈరోజు(గురువారం) ఉదయం పోస్టుమార్టం(Postmortem) పూర్తిచేశారు. అనంతరం కుటుంబీకులకు మృతదేహాలను అప్పగించారు.
18 ఏళ్ల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబురాలు జరిగాయి. ఈ నేపథ్యంతో మరుసటిరోజే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సమీపంలో ర్యాలీ, విధాన సౌధలో ఆర్సీబీ జట్టుకు ప్రభుత్వం సన్మానం చేయాలని భావించింది. అయితే భారీ సంఖ్యలో అభిమానులు రావడం, అదే సమయంలో గందరగోళం నెలకొని తొక్కిసలాట జరగడం, పోలీసులు వాళ్లను అదుపు చేయలేకపోవడంతో ప్రాణ నష్టం జరిగింది.
ఇది కూడా చదవండి: భారత్-పాక్ వివాదంపై ట్రంప్-పుతిన్ చర్చ