మొదటిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగుతున్న అస్సాం కాంగ్రెస్ చీఫ్
జోర్హాత్: లోక్సభ సభ్యుడు, అస్సాం కాంగెస్ర్ అధ్యక్షుడు గౌరవ్ గొగొయ్ సోమవారం జోర్హాట్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. జోర్హాట్ స్టేడియం నుంచి భారీ ర్యాలీతో అట్టహాసంగా జిల్లా కమిషనర్ కార్యాలయానికి ఆయన బయలుదేరారు. దాదాపు మూడు గంటలపాటు ర్యాలీ కొనసాగింది. గొగొయ్ మద్దతుదారులతోపాటు కాంగ్రెస్ కూటమిలోని ఆరుపార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
జోర్హాట్ ఎంపీగా ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష ఉపనేతగా గొగోయ్ కొనసాగుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే మొదటిసారి. నామినేషన్కు ముందు మీడియాతో మాట్లాడుతూ అస్సాం రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు దీనినో అవకాశంగా భావిస్తున్నానన్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. సమాజాన్ని, రాజకీయాలను శుద్ధి చేసేందుకు తనతో చేతులు కలపాలని ప్రజలను కోరారు.
తాము అధికారంలోకి వస్తే పార్టీలతో నిమిత్తం లేకుండా అందరినీ సమానంగా ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములుగా చేస్తామని చెప్పారు. పార్టీ ర్యాలీలు, కార్యక్రమాల్లో పాల్గొన్న వారికే పథకాలను అమలు చేస్తామంటూ అధికార బీజేపీ మహిళలను అవమానిస్తోందని గొగొయ్ విమర్శించారు. జోర్హాట్ స్థానం నుంచి బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్రనాథ్ గోస్వామితో గొగొయ్ తలపడనున్నారు. గోస్వామి 1991 నుంచి ఏజీపీ తరఫున, అనంతరం 2016 నుంచి బీజేపీ తరఫున వరుసగా ఐదు పర్యాయాలు జోర్హాట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.


