సీబీఐ, ఈడీలను ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు
లక్నో: లోక్సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున అక్రమాస్తులను పోగేసుకున్నారంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్.విజ్ఞేశ్ శిశిర్ వేసిన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టులోని లక్నో ధర్మాసనం స్పందించింది. ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ, ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాలని జస్టిస్ రాజేశ్ చౌహాన్, జస్టిస్ జఫీర్ అహ్మద్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. మే 12వ తేదీన ఇన్–చాంబర్ విచారణ చేపట్టిన కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది.
జూలై 20వ తేదీలోపు తాజా దర్యాప్తు నివేదికను సమరి్పంచాలని సంబంధిత కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత గతంలో, ప్రస్తుతం వేర్వేరు ఎంపీ నియోజకవర్గాల నుంచి పోటీచేసి గెల్చిన నేపథ్యంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ, రెవిన్యూ, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖతోపాటు తీవ్రమైన నేరాల దర్యాప్తు విభాగం డైరెక్టర్(డీఎస్ఎఫ్ఐఓ) అంతర్గత దర్యాప్తు జరిపి 8 వారాల్లోపు నివేదించాలని ధర్మాసనం సూచించింది. ఇప్పటికే పిటిషనర్ నుంచీ తాము ఫిర్యాదు అందుకున్నామని హైకోర్టుకు సీబీఐ, ఈడీ తెలిపాయి.


