ఆత్మకూరు: సాగునీటి కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటాన్ని ఆంక్షలతో అడ్డుకోలేరని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు రైతులు, ప్రజలు తరలి రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం తగద న్నారు. పోలీసుల ఆంక్షలు సరైనవి కావన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వచ్చే నెల 1వ తేదీన తలపెట్టిన వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు, కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడం తగదన్నారు. ట్రాక్టర్లు సీజ్ చేస్తాం, కేసులు నమోదు చేస్తామని వైఎస్సార్సీపీకి సంబంధించిన ట్రాక్టర్ యజమానులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. ట్రాక్టర్లను అడ్డుకుంటే ఆటోలో వస్తాం, ఆటోలను అడ్డుకుంటే బైకులపై వస్తాం, బైకులను అడ్డుకుంటే పాదయాత్రగా చేరకుంటామే కానీ.. కార్యక్రమాన్ని విరమించుకునే ప్రసక్తే లేదని శిల్పా స్పష్టం చేశారు. ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తే రాత్రింబవళ్లు అక్కడే కూర్చొని నిరసన తెలియజేస్తామన్నారు. పోరాటాలకు సిద్ధపడిన తమను కేసులతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నా సాగునీటి కాల్వలకు నీరు ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా నీళ్లను తోడేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోలేక పోవడం వెనుక చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు. నీటి కోసం రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఎక్కడా కనబడటం లేదన్నారు.
ట్రాక్టర్లను అడ్డుకుంటే
పాదయాత్రగా వీబీఆర్
చేరుకుంటాం
శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే
శిల్పా చక్రపాణిరెడ్డి


