బేతంచెర్ల: ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అబద్ధ్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సోమవారం పట్టణంలోని కోటపేట కాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను మాజీ మంత్రి బుగ్గన ఆప్యాయంగా పలకరించి, వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను పలువురు మహిళలు బుగ్గనకు వివరించారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం వారానికి ఒక్కసారి కుళాయిలకు నీరు వదులుతున్నారని, డ్రైనేజీ కాల్వలు శుభ్రం చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో జగనన్న సీఎం అయ్యింటే డోన్ నియోజకవర్గం రూపురేఖలు మారేవన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బేతంచెర్ల పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 351 కోట్లతో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి పైపులైన్ వేయించి తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపామన్నారు. మన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే పట్టణంలో సంపులు, పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తయి 24 గంటలు నీరు అందుబాటులో ఉండేదన్నారు. బేతంచెర్ల నగర పంచాయతీలో పాలక మండలి పనులకు అధికార పార్టీ అడ్డు పడుతుందని మాజీ మంత్రి బుగ్గన విమర్శించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి సీఎం చంద్రబాబుకు పట్టదన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులను కూడా పూర్తి చేయలేని స్థితిలో ఉన్నారన్నారు. ప్రజా సమస్యలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయా గ్రామాలు, పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆర్యవైశ్యులు, రజక సంఘం నాయకులు మాజీ మంత్రి బుగ్గనను మర్యాద పూర్వకంగా కలిశారు. రజక సంఘం నాయకులు బుగ్గనను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు బాబురెడ్డి, మూర్తుజావలి, ఖాజ హుసేన్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, అధికార ప్రతినిధి మురళీ కృష్ణ, టౌన్ కన్వీనర్ జాకీర్ హుసేన్, బ్రహ్మనాయుడు, తిరుమలేష్ , రామ చంద్రుడు, మహేష్, సలీం, ఖాజా పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమం,
అభివృద్ధి సీఎంకు పట్టదు
రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు
సిద్ధంకండి
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి


