నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎంఈఓలను డీఈఓ జనార్దన్రెడ్డి, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజులు ఆదేశించారు. సమగ్ర శిక్ష మీటింగ్ హాల్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. డిప్యూటీ డీఈఓ శంకర్ప్రసాద్, వెంకటరామిరెడ్డి, ఎస్ఎస్ఏ ఈఈ సంపత్, జగన్మోహన్రెడ్డి, ప్రసన్నకుమార్, శ్రీనివాసరెడ్డి, రామ్మోహన్, ఎంఈఓలు పాల్గొన్నారు.
ఓపెన్ ఇంటర్ పరీక్షలు..
జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. శనివారం రసాయన శాస్త్రం, అర్థశాస్త్రం పరీక్షలకు 684 మంది విద్యార్థులకు గాను 627 మంది హాజరు కాగా 57 మంది గైర్హాజరయ్యారన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. శనివారం నిర్వహించిన ఎకనామిక్స్–1, వొకేషనల్–1 పరీక్షకు 91.2 శాతం విద్యార్థులు హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశామన్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించామన్నారు.
నేడు ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థాన పరివార దేవాలయమైన పాలధార–పంచధార వద్ద శారదాంబ సహిత జగద్గురు ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శనివారం నూతన విగ్రహాలకు ధాన్యాధివాస కార్యక్రమం, సాయంత్రం పుష్పాధివాసము, శయ్యాధివాసము, అధివాస హోమాలు జరిపించి మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ పాలధార–పంచధార వద్ద గత రెండు రోజులుగా విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఆదివారం ఉదయం 11గంటలకు నూతన ఆలయంలో దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారి చేతుల మీదుగా నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఉత్తమ లైన్మ్యాన్గా నాగరాజు
బేతంచెర్ల: పట్టణానికి చెందిన నాగరాజు శేఖర్ ఏపీ రాష్ట్రం తరఫున ఉత్తమ లైన్మ్యాన్ అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం ఢిల్లీలో సెంట్రల్ విద్యుత్ బోర్డ్ చైర్మన్ ఘన శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న నాగరాజు శేఖర్కు విద్యుత్ శాఖ అధికారులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.


