కర్నూలు: క్రీడాపోటీలు ఉత్సాహాన్ని పెంచడమే గాకుండా పరస్పర సహకారం, స్నేహభావాన్ని పెంచుతాయని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించారు. మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని టగ్ ఆఫ్ వార్, షార్ట్ పుట్, త్రోబాల్, టెన్నికాయిట్, మ్యూజికల్ చైర్స్ తదితర ఆటలలో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు వారి ఆరోగ్యం, సంతోషానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డీపీఓ ఏఓ విజయలక్ష్మి, మినిస్టీరియల్ సిబ్బంది, ఆర్ఐ నారాయణ, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.


