కల్యాణోత్సవం.. నయనానందకరం
కల్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులు
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో ఆదివారం లక్ష్మీనరసింహస్వామి పరిణయోత్సవం కన్నుల పండువగా సాగింది. ముందుగా పండితులు పుణ్యాహవచనం చేశారు. నవగ్రహ మంటపరాధన అనంతరం విశేష పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సమర్పించిన పట్టు వస్త్రాలతో స్వామి, అమ్మవార్లను పెండ్లి కూతురు, పెండ్లి కుమారులుగా అలంకరించారు. పల్లకీలో కొలువుంచి ఊరేగింపుగా పెండ్లి మంటపానికి తోడ్కొని వచ్చి పెళ్లి పీటలపై కొలువుంచారు. ఎదుర్కోళ్లు నిర్వహించిన అనంతరం వైష్ణవ ఆచారంగా పండితులు వేదమంత్రోచ్ఛారణలతో కల్యాణాన్ని నిర్వహించారు. యజ్ఞధారణ, జీలకర్ర బెల్లం తతంగాలు చేపట్టాక మాంగళ్య ధారణ నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు కార్యక్రమం పూర్తి చేశారు. స్వామి, అమ్మవారి మీద నుంచి కింద పడ్డ తలంబ్రాలను భక్తులకు పంచి పెట్టారు. ముఖ్య అతిథులుగా (పెళ్లి పెద్దలుగా) పాల్గొన్న భక్తులకు ఆర్చకులు కంకణ ధారణ చేశారు. కమనీయ దృశ్యాన్ని తనివితీరా చూసిన ప్రతి హృదయం అంతులేని ఆనందంతో మురిసింది. నూతన పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా అలంకరించిన ప్రహ్లాదవరదుడిని, అమృతవల్లీ అమ్మవార్లను వేదిక వద్ద కొలువు దీర్చినది మొదలు జరిగిన ప్రతి ఘట్టం పరమార్థంతో నిండి ముగ్ధమనోహరంగా ఆలరించింది.
ఆకట్టుకున్న ఎదుర్కోల్ల ఉత్సవం
ప్రత్యేకంగా అలంకరించిన స్వామి, అమ్మవారిని వేరువేరు పల్లకీల్లో కొలువుంచి పెళ్లి మండపానికి తోడ్కొని వచ్చే ముందు సాంప్రదాయ ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామి తరఫున కొందరు, అమ్మవారి తరఫున కొందరు అర్చకులు బంధుగణంగా విడిపోయి పెద్ద మనుషులుగా వ్యవహరిస్తారు. కట్నకానుకలు, ఆడపడుచు లాంఛనాలు, ఇచ్చి పుచ్చుకోవడం తదితర విషయాలు చర్చించుకుంటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుకునే మాటలు విశేషంగా అలరించడంతో పాటు ఆలోపించజేసింది. అనంతరం స్వామి, అమ్మవారిని ఒక్కటిగా చేసి కల్యాణ మండపానికి తోడ్కొని పోయారు.
మండపంలో కొలువైన స్వామి, అమ్మవారు
కల్యాణోత్సవం నిర్వహిస్తున్న పీఠాధిపతి, అర్చకులు
కల్యాణోత్సవం.. నయనానందకరం
కల్యాణోత్సవం.. నయనానందకరం


