నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు పెండింగ్లో ఉంచవద్దని, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 104 ఫిర్యాదులు రాగా, వాటిలో రెవెన్యూశాఖకు 70, ఇతర శాఖలకు సంబంధించినవి 34 వచ్చాయని తెలిపారు. ఈ నెల 28న రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు నల్లగొండకు రానున్నట్లు తెలిపారు. అదే రోజు ఉదయం 10 గంటలకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, అప్పీలేట్ అథారిటీ అధికారులకు ఆర్టీఐపై అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. సెక్షన్ 4(1)(బి) కింద వెల్లడించాల్సిన సమాచారాన్ని ముందుగానే నవీకరించి సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రస్తుత సంవత్సరంలో వచ్చిన ఆర్టీఐ దరఖాస్తుల వివరాలను నమోదు చేయాలని, లేనిపక్షంలో ‘నిల్’గా నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీవోలు శ్రీదేవి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్


