నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత రైతు భరోసా నిధులను మంగళవారం విడుదల చేసింది. జిల్లాలో 5,20,741 మంది రైతుల ఖాతాల్లో రూ.267.81 కోట్లు జమచేసింది. ఇప్పటి వరకు మొదటి, రెండవ విడతలు కలిపి 5,40,693 మంది రైతుల ఖాతాల్లో రూ.448,09,89,256 జమ చేసింది. రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ అయ్యింది.
పౌష్టికాహారం
అందించడమే లక్ష్యం
రామగిరి(నల్లగొండ) : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే పోషణ్ పక్వాడ లక్ష్యమని ఐసీడీఎస్ జిల్లా అధికారి కృష్ణవేణి అన్నారు. పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లతో ఆమె సమావేశమై మాట్లాడారు. అంగన్వాడీ ప్రీస్కూల్ పిల్లల సంఖ్య పెంచాలన్నారు. తల్లులకు పోషకాహార విలువపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ నిర్మల, ఎంపీడీఓ యాకుబ్నాయక్, సూపర్వైజర్లు పద్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు బదిలీ
● నూతన డీఎస్పీగా తుమ్మ ఆనంద్రెడ్డి
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖరరాజును బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్ సీఐడీ డీఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంటలిజెన్స్ డీఎస్పీగా పని చేస్తున్న తుమ్మ ఆనంద్రెడ్డి మిర్యాలగూడ డీఎస్పీగా పంపారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సందర్భంగా బదిలీపై వెళుతున్న డీఎస్పీ కె.రాజశేఖరరాజు మాట్లాడుతూ.. మిర్యాలగూడ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల కట్టడిలో సహకరించిన సీఐలు, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా తుమ్మ ఆనంద్రెడ్డి గతంలో దేవరకొండ డీఎస్పీగా, హాలియా, మిర్యాలగూడ సీఐగా, హాలియా ఎస్ఐగా పనిచేసిన చేశారు. నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు.
విద్యార్థులకు పోటీలు
నల్లగొండ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు వ్యాసరచన, వకృత్త్వం, క్విజ్, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ మంగళశారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు 26వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించాలని సూచించారు.
మేడేను జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : మేడేను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, ఇళ్ల అద్దెలు, ధరలు, విద్య, వైద్యం ఖర్చులు కార్మికులకు మోయలేని భారమయ్యాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికుల సంఘటితమై తమ బతుకులు మార్చుకోడానికి ఈ మేడేను ఉద్యమంలా జరుపుకోవాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, పోలే సత్యనారాయణ, భీమగాని గణేశ్, అద్దంకి నరసింహ, జంజరాల శ్రీనివాస్, సలివోజు సైదాచారి, గంజి రాజేష్, సుంకరబోయిన వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.


