ఫ బీజేపీ జాతీయ అధికార
ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్రా
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని, పార్లమెంట్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్రా అన్నారు. మంగళవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారీశక్తి వందన్ 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూర్తి వివరాలు వెల్లడించినా కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ జరిగితే మహిళకు అన్ని చట్టసభల్లో అధిక సీట్లు లభిస్తాయన్నారు.తెలంగాణలో కూడా ప్రస్తుతం ఉన్న 17 సీట్ల లోక్సభ సీట్లు 25 వరకు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చకుండానే.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తోందని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, కంకణాల నివేధిత, రేవతి, విజయలక్ష్మి, అరుణ పాల్గొన్నారు.


