కనగల్ : మండలంలోని దర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఆదివారం ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ ఎన్నిక
నల్లగొండ టూటౌన్ : అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ ఎన్నికలు ఆదివారం నల్లగొండలో నిర్వహించారు. అధ్యక్షుడిగా ఈసం మారయ్య, ప్రధాన కార్యదర్శిగా గోలి మల్లేష్, ఉపాధ్యక్షులుగా గాదరి సుందరయ్య, కూకుంట్ల ఫిలిప్స్ కుమార్, కోశాధికారిగా సింగం వెంకటయ్య, సహాయ కార్యదర్శులుగా రాసవల్ల శ్రీనివాస్, పెరమళ్ల వినయ్కుమార్, సాంస్కృతిక కార్యదర్శిగా ఈసం యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన బుచ్చిరాములు, గోలి మల్లేశానికి నూతన కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.
యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజను విశేషంగా నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.
పంచభూతాల కలయికే హిందుత్వం
చౌటుప్పల్ : పంచభూతాల కలయికే హిందుత్వమని త్రైలింగ ప్రాంత సామాజిక సంఘటన సేవాప్రతి వాసుదేవానంద సరస్వతి తెలిపారు. హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్స్టేషన్ ప్రాంగణంలో ఆదివారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుదేవానంద సరస్వతి జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. హిందుత్వం అంటే సమానత్వమన్నారు. కులాలు ఏవైనా అందరూ కలిసిమెలిసి జీవనం సాగించమని చెప్పేదే హిందుత్వమని తెలిపారు. తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ్ జిన్న సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పౌరులు సన్మార్గంలో నడవాలంటే హనుమాన్ చాలిసా చదవాలని, లేదంటే ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాఖలకు వెళ్లాలని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ద్వారా వ్యక్తి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రముఖ సామాజికవేత్త పర్వతం సంధ్యారాణి మాట్లాడుతూ.. మనిషికి నైతిక విలువలు ఎంతో అవసరమని తెలిపారు. ఎన్ని ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నా నైతిక విలువలు, క్రమశిక్షణ లేకుంటే జీవితం వ్యర్ధమన్నారు. హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు కేవీబీ.కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు, సమ్మేళన సమితి ప్రధాన కార్యదర్శి కొసునం రాంరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాసులు, ప్రతినిధులు బడుగు శ్రీరాములు, పోలోజు రాజుచారి తదితరులు పాల్గొన్నారు.


