మోతె : జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడే దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం అన్నారు. ఆదివారం మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో ఏబీఆర్ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, బీసీలకు అందించాలన్నారు. విద్యకు అధిక బడ్జెట్ను కేటాయించి అందరికి ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. నేడు తెలంగాణలో ఎస్సీ మాదిగ కులస్తులు 40 నుంచి 50 లక్షల మంది ఉన్నారని, 80 ఏళ్ల నుంచి దళితుల పరిస్థితి హీనంగా ఉందని పేర్కొన్నారు. తళితులు మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు తొలగిస్తామనడం సబబు కాదన్నారు. దళితులు విద్యతోనే చైతన్యవంతులు కావాలని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం ఏపూరి సోమన్న కళా బృందంతో ఆటా, పాటా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడి లింగయ్య, నాయకులు పొడపంగి యలమంచి, పొడపంగి ముత్తయ్య, బక్కమ్మ కిష్టయ్య పాల్గొన్నారు.


