నల్లగొండ టౌన్ : సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావుఫూలే, అంబేడ్కర్ అని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.అబ్బాస్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన ఫూలే, అంబేడ్కర్ జన జాతర సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఫూలే, అంబేడ్కర్ భారతీయ సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం స్థాపనకు శాసీ్త్రయ దృక్పథంతో నిరంతరం పోరాడిన మహనీయులు అన్నారు. ఫూలే విద్యను.. సామాజిక విముక్తి సాధనంగా భావించి అణగారిన వర్గాల సాధికారతకు పునాది వేశారని, అంబేడ్కర్ రాజ్యాంగ రూపకర్తగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను సంస్థాగతంగా స్థాపించారని చెప్పారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య మాట్లాడుతూ అవమానాలకు గురవుతున్న అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి అక్షరాలను ఆయుధంగా ఎంచుకుని ఫూలే, అంబేడ్కర్ చేసిన పోరాటం భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమన్నారు. కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది దర్శనం నరసింహ, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, రేముడాల పరుశరాములు, గాదె లింగస్వామి, నేలపట్ల సత్యనారాయణ, కొలగాని పర్వతాలు, ఎడ్ల సైదులు, మల్లెపాక వెంకన్న, మామిడి సైదులు, బకరం శ్రీనివాస్, మానుపాటి భిక్షమయ్య, రజియోద్దీన్, బోనగిరి దేవేందర్, పందుల సైదులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


