కనగల్ : అనుమానాస్పద స్థితిలో వాచ్మెన్ మృతిచెందాడు. వివరాలు.. కనగల్ మండలం దర్వేశిపురం గ్రామ పరిధిలోని వేద ఫంక్షన్హాల్–2 లో ఇద్దరు వాచ్మెన్ల మధ్య పాత నూనె డబ్బాల విషయంలో శనివారం సాయంత్రం గొడవ జరిగింది. ఈ ఘటనలో కనగల్ గ్రామానికి చెందిన వాచ్మెన్ దొమ్మాటి సైదులు(56)పై గుర్రంపోడు మండలం గన్సిరాంతండాకు చెందిన మెగావత్ గోపీనాయక్ చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగి ఎవరి గదిలోకి వారు వెళ్లారు. కాగా ఆదివారం ఉదయం కడుపులో నొప్పి వస్తుందని సైదులు భార్యకు చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. చికిత్స నిమిత్తం అతడిని నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గోపినాయక్ దాడి కారణంగానే తన భర్త సైదులు మరణించాడని మృతుడి భార్య అక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండూరు సీఐ కే. ఆదిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఎస్. రామయ్య తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సైదులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. మృతుడితో గొడవపడిన గోపినాయక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


