ఫ కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ : ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తం చేస్తూ మున్సిపల్, గ్రామ స్థాయిలో నియమించిన కమిటీలు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. నల్లగొండ కలెక్టరేట్ నుంచి శుక్రవారం జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, ఉపాధి కూలీలు, రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లు, మున్సిపల్ శానిటరీ వర్కర్లు అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే టీపీలు ధరించి నీళ్ల బాటిల్, వెంట ఉంచుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈనెల 18న గ్రామస్థాయిలో వడగాల్పులపై అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. వడగాల్పులపై ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రతిరోజు నివేదిక పంపించాలని, అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పశువుల తొట్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ఓఆర్ఎస్ పాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. అత్యసరమైతే జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ప్రీ నంబర్ 18004251422 , వాట్సాప్ నంబర్ 6305951279కు తెలియజేయాలని సూచించారు.


