విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలి

Apr 16 2026 10:00 AM | Updated on Apr 16 2026 10:00 AM

నార్కట్‌పల్లి : విద్యార్థుల్లోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రతిభా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని డీఈఓ భిక్షపతి అన్నారు. నార్కట్‌పల్లిలో జెడ్పీహెచ్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌లో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ప్రతిభా పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు డీఈఓ బహుమతులు అందజేసి మాట్లాడారు. 32 మంది విద్యార్థులు ప్రతిభా పోటీల్లో విజేతలుగా నిలువడం సంతోషించదగిన విషయమన్నారు. ఈ సందర్భంగా ప్రతిభా బహుమతుల కింద రూ.10 వేల ఆర్థికసాయం చేసిన కై రంకొండ రామకృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కూకుట్ల నరసింహ, హెడ్మాస్టర్‌ డి.రాములు, రహీమున్నీసా బేగం, శరత్‌, రవీందర్‌రెడ్డి, అరుణ, స్వప్న, నరేష్‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

హెటెరోలో ఉద్యోగాలకు 18న ఇంటర్వ్యూ

నల్లగొండ : హైదరాబాద్‌లోని హెటెరో ఫార్ములేషన్స్‌ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 18న నల్లగొండలోని టీజీఎంఆర్‌జేసీ బాలుర కళాశాలలో అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ (స్పెషల్‌ డ్రైవ్‌) నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ మహ్మద్‌ అబ్దుల్‌ కయ్యూం ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలి, అర్హత, నెల వారి వేతనం తదితర పూర్తి వివరాలకు సెల్‌ : 8121043322 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచి

రామగిరి (నల్లగొండ) : సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచి అని కవి, విమర్శకుడు డాక్టర్‌ పగడాల నాగేందర్‌ అన్నారు. నల్లగొండ ఎన్జీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఎం.ఏ తెలుగు విద్యార్థులకు ఆస్తిత్వ ఉద్యమాలు ఆరంభ వికాసాలు అనే అంశంపై బుధవారం నాగేందర్‌ విస్తృతోపన్యాసం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ్త్రవాద, దళిత, బహుజన, ముస్లిం మైనార్టీ, ప్రాంతీయ అస్తిత్వ వాదాలు కేవలం తాత్కాలిక ఉద్యమాలు కావని, అవి సమాజంలో పాతుకుపోయిన అసమానతలపై చేసే నిరంతర పోరాటాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సముద్రాల ఉపేందర్‌, తెలుగు విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌, డాక్టర్‌ వాస భూపాల్‌, డాక్టర్‌ టంగుటూరి సైదులు, అంజయ్య, లింగస్వామి, శ్రవణ్‌ కుమార్‌, వనజ అధ్యాపకులు పాల్గొన్నారు.

కొలతల ప్రకారం ఉపాధి పనులు చేయాలి

నకిరేకల్‌ : ఉపాధి హామీ పనుల్లో రోజువారి వేతనం రూ.307 రావాలంటే కొలతల ప్రకారం పని చేయాలని డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి అన్నారు. నకిరేకల్‌ మండలం చందంపల్లి గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పని ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. కాల్వ పూడక తీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, నర్సరీని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏపీఎం రమణయ్య ఉన్నారు.

యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు వైభవంగా నిర్వహించారు. వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement