రెండో విడత రైతు భరోసా ఏదీ! | - | Sakshi
Sakshi News home page

రెండో విడత రైతు భరోసా ఏదీ!

Apr 16 2026 10:00 AM | Updated on Apr 16 2026 10:00 AM

ప్రభుత్వం నిర్ణయం

తీసుకోవాల్సి ఉంది

నల్లగొండ అగ్రికల్చర్‌ : యాసంగి సీజన్‌కు సంబంధించిన రెండో విడత రైతు భరోసా నిధుల జమపై ప్రభుత్వం నేటికీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. మొదటి విడతలో ఎకరంన్నర భూమి ఉన్న రైతులందరికీ మార్చి 22వ తేదీన రూ.6 వేల చొప్పున ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి రెండో విడత నిధులను జమ చేసి ఈ నెలాఖరు వరకు మూడు విడతలో రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాలకు నిధులు జమ చేస్తామని ప్రకటించింది. అసలు రెండో విడత రైతు భరోసా నిధులు జమ చేస్తుందో చేయదోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎకరాకు రూ.12 వేల చొప్పున..

గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి వానాకాలం, యాసంగి సీజన్‌కు కలిపి రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసేది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతో ఎకరాకు సంవత్సరానికి రెండు సీజన్లకు కలిపి రూ.12 వేలు చొప్పున జమ చేస్తానని హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున గత యాసంగి సీజన్‌లో 2025 జనవరి 26న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి మొదటి విడతలో ఎకరంన్నర భూమి ఉన్న రైతులందరికీ రూ.268.57కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రెండో విడత, మూడో విడత భరోసా నిధులను తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.

ఈ నెల 13 నుంచే రెండో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే రైతుల ఖాతాల్లో జమచేస్తాం.

– పాల్వాయి శ్రవణ్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయాధికారి

ఫ 13 నుంచి జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం

ఫ ఇప్పటి వరకురాని స్పష్టత

ఫ మొదటి విడతలో రూ.268.57 కోట్లు జమ

ఫ ఎదురుచూపుల్లో రైతాంగం

Advertisement
 
Advertisement
Advertisement