విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాం | - | Sakshi
Sakshi News home page

విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాం

Apr 16 2026 10:00 AM | Updated on Apr 16 2026 10:00 AM

శాలిగౌరారం : శాలిగౌరారం ఎంపీడీఓపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి తెలిపారు. కార్యాలయ సిబ్బంది నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శాలిగౌరారం ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిపై బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి శంకర్‌నాయక్‌, డీఆర్‌డీఓ, మండల ప్రత్యేక అధికారి శేఖర్‌రెడ్డిలతో కలిసి ఆయన విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శులతో విడివిడిగా మాట్లాడగా ఎంపీడీఓ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను వివరించారు. కొంతమంది చెప్పలేక లిఖితపూర్వకంగా ఇవ్వనున్నట్లు విచారణ అధికారి దృష్టికి తీసుకురావడంతో సరేనన్నట్లు సమాచారం. అనంతరం మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓపై అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని కూడా అందజేసినట్లు తెలుస్తుంది. అనంతరం ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిని కూడా విడిగా విచారించారు. ఇదిలా ఉండగా గ్రామసభలో శాలిగౌరారం పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఎంపీడీఓ నివేదిక అందజేశారు. ఈ సంఘటనలపై అదనపు కలెక్టర్‌ ప్రత్యేకంగా కార్యదర్శి, ఎంపీడీఓలతోపాటు పంచాయతీ పాలకవర్గాన్ని విచారించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిపై వచ్చిన ఆరోపణలతో పాటు పరస్పర ఫిర్యాదులపై విచారణ జరిపామన్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ అశోక్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement