సాగర్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ
నల్లగొండ : నాగార్జునసాగర్ ప్రాంతాన్ని జాతీయస్థాయి ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపట్టిందని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో టూరిజం, ఆర్కియాలజీ, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే సమగ్ర పర్యాటక కేంద్రంగా సాగర్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో బుద్ధవనం, పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వర దేవాలయాలు, దేవరకొండ కోట, ఫణిగిరి బౌద్ధస్థలం, చాకలిగుట్టు ద్వీపం, నక్కలగండి ప్రాజెక్ట్, నందికొండ ద్వీపంలోని ఏలేశ్వర ఆలయం, పొగిళ్ల జలపాతాలు, గాజుబేడ గుహలు పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయన్నారు. జాతరలు, వారాంతపు మార్కెట్లు, ఒగ్గుకథ, తోలుబొమ్మలాట వంటి జానపద కళారూపాలను పర్యాటక అభివృద్ధికి అనుసంధానం చేయనున్నామని తెలిపారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. సమావేశంలో రాఘవేంద్ర మాస్టర్, బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిజం కన్సలెంట్ ఓం ప్రకాష్, నల్లగొండ ఏఎస్పీ రమేష్, ఆర్డీఓలు అశోక్రెడ్డి, శ్రీదేవి, రమణారెడ్డి, జిల్లా క్రీడల అధికారి అక్బర్అలీ పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్


