పోలీసుల అదుపులో దొంగ స్వాములు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో దొంగ స్వాములు

Apr 27 2025 1:24 AM | Updated on Apr 27 2025 1:24 AM

పోలీసుల అదుపులో దొంగ స్వాములు

పోలీసుల అదుపులో దొంగ స్వాములు

మోత్కూరు: సంతాన ప్రాప్తికి పూజలు చేస్తామని ప్రజల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్న దొంగ స్వాములను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మోత్కూరు మండలం పనకబండలో శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పైళ్ల సతీష్‌, మహాలక్ష్మి దంపతులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ ఘణపూర్‌ గ్రామానికి చెందిన కళ్లెం విజయ్‌ పనకబండ గ్రామంలో సంచరిస్తూ సతీష్‌ నిర్వహిస్తున్న కిరాణం దుకాణం వద్దకు వెళ్లి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికి పూజలు చేస్తామని, కన్నె స్వాములతో పూజలు చేయిస్తే పిల్లలు పుడతారంటూ బొట్లు పెట్టి నమ్మబలికారు. ముందుగా బొట్టు పెట్టగానే రూ.1,500 నగదు, రూ.700 ఫోన్‌ పే ద్వారా చెల్లించారు. ప్రత్యేక పూజల కోసం రూ.11 వేలకు బేరం కుదుర్చుకున్నారు. శనివారం ఉదయం తన సోదరులైన కళ్లెం జీవన్‌లాల్‌, కళ్లెం కృష్ణతో కలిసి ఆంజనేయ స్వాముల వేశాలతో కళ్లెం విజయ్‌ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడాన్ని గమనించిన ప్రజలు వారి పొంతన లేని సమాధానాలపై నిలదీశారు. ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత వసూలు చేశారని ప్రశ్నించగా కొందరి వద్ద వసూళ్లకు పాల్పడినట్లు స్వాములు ఒప్పుకున్నారు. దీంతో ముగ్గురికి దేహశుద్ధి చేసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించారు. గ్రామస్తుల సమాచారంతో దొంగ స్వాములను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ డి.నాగరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement