
తండ్రికి బైక్ను బహుమతిగా ఇచ్చేందుకు వెళ్తుండగా..
మునగాల: మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారు వద్ద హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి–65పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృత్యువాత పడింది. మునగాల ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామానికి చెందిన చేడె జనార్దన్ కుమార్తె యశస్విని(24) మూడేళ్లుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తోంది. కాగా యశస్విని తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలనుకుని బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో తన సహా ఉద్యోగి బడ్డుకొండ అచ్యుత్కుమార్తో కలిసి అదే బుల్లెట్ బైక్పై తమ స్వగ్రామమైన తందూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడిఉన్న గేదె కళేబరాన్ని వీరి బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న యశస్విని ఎగిరి రోడ్డుపై పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ఓ లారీ అతివేగంగా వచ్చి రహదారిపై పడిఉన్న యశస్విని మీదుగా వెళ్లింది. దీంతో యశస్విని తల, మెడభాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న అచ్యుత్కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యశస్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో శనివారం మృతురాలి కుటుంబ సభ్యులు మునగాలకు చేరుకున్నారు. మృతురాలి బాబాయ్ చేడె సురేష్ ఫిర్యాదు మేరకు మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపారు. పోస్టుమార్టం అనంతరం యశస్విని మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
ఆకుపాముల వద్ద హైవేపై గేదె
కళేబరాన్ని ఢీకొట్టిన బైక్
ఎగిరి రోడ్డుపై పడిన
యువతి మీదుగా వెళ్లిన లారీ
మృతురాలు పశ్చిమ గోదావరి
జిల్లా తందూరు వాసి