కందనూలు: నీళ్ల విరేచనాల నియంత్రణ, నులిపురుగుల నిర్మూలన, పల్స్ పోలియో కార్యక్రమాలపై ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ పీహెచ్సీల పరిధిలోని ఆశా వర్కర్లతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో 17 శాతం డయేరియా వల్లే సంభవిస్తాయని, వాటిని అరికట్టడానికి సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఈ నెల 16 నుంచి 31 వరకు డయారియా క్యాంప్ నిర్వహించాలని సూచించారు. అలాగే ఈ నెల 28, 29 ,30 తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో 1–19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోలు మాత్రలు వేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు రవికుమార్, సురేష్బాబు, డీపీఓ రేనయ్య, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.


