నాగర్కర్నూల్ రూరల్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రాజేష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల లబ్ధిదారుకలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్, యార రమేష్, బండ పర్వతాలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలకు 213 మంది గైర్హాజరు
కందనూలు: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 213 మంది విద్యార్థులు గైర్హాజ రయ్యారని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో గణితం, వృక్షశాస్త్రం, రాజనీతిశాస్త్రం పరీక్ష నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 2,876 మందికి గాను 2,715 మంది హాజరయ్యారు. అలాగే జనరల్ విభాగంలో 2,579 మందికి గాను 2,436 మంది, ఓకేషనల్ విభాగంలో 297 మందికిగాను 279 మంది పరీక్ష రాశారు. ద్వితీయ సంవత్సరంలో 917 మందికి గాను 865 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 822 మందికి గాను 785 మంది, ఓకేషనల్ విభాగంలో 95 మందికి గాను 80 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొదటి సంవత్సరంలో 161 మంది, ద్వితీయ సంవత్సరంలో 52 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ తెలిపారు.
పంట మార్పిడితో
అధిక దిగుబడులు
చారకొండ: రైతులు యూరియా వాడకాన్ని తగ్గించడంతో పాటు పంటమార్పిడి చేస్తే అధిక దిగుబడులు వస్తాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ పల్లవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఏఓ తనూజరాజ్ ఆధ్వర్యంలో ‘రైతు ముగింట్లో శాస్త్రవేతలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొఫెసర్లు మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచడం ద్వారా సాగు ఖర్చులు తగ్గి, లాభాలు వస్తాయన్నారు. విత్తనాల ఎంపికలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ పంట కాల పరిమితి, దిగుబడి తదితర అంశాలపై వివరించారు. అనంతరం వ్యవసాయ సాగు పద్ధతుల కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ గుర్వయ్య గౌడ్, డైరెక్టర్ జగన్మోహన్, ఏఈఓలు వంశీ, అనూష రైతులు ఉన్నారు.


