కందనూలు: గ్రంథాలయాలు విద్యార్థుల జ్ఞాన కేంద్రాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విద్యా వ్యవస్థలో జ్ఞాన కేంద్రాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల్లో పఠన అలవాటును పెంపొందించడం ద్వారా వారి సృజనాత్మకత, విశ్లేషణా సామర్థ్యం, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు. పుస్తకాలు మనకు నిజమైన మార్గదర్శకాలు అన్నారు. తరగతి గదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని మరింత విస్తరించాలంటే గ్రంథాలయ పఠనం అత్యంత అవసరమని సూచించారు. ఆధునిక సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా పుస్తకాల ద్వారా లభించే లోతైన జ్ఞానానికి ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ కురుమయ్య, జిల్లా ఏఎంఓ కిరణ్ కుమార్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


