పెద్దకొత్తపల్లి: నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న, వరి ధాన్యం తీసుకొచ్చినా కాంటా చేయడం లేదని ఆగ్రహించిన రైతులు శుక్రవారం పెద్దకొత్తపల్లి బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకోను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండలంలో దేవునితిర్మలాపూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా.. కొనుగోలు చేపట్టలేదని మండిపడ్డారు. సింగిల్ విండో సీఈఓ సీరాజ్ద్దీన్ రైతులకు ఎంత నచ్చచెప్పినా రైతులు శాంతించలేదు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ సతీష్ ధర్నా వద్దకు చేరుకొని ఫోన్ ద్వారా అదనపు కలెక్టర్ అమరేందర్తో మాట్లాడి వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అనంతరం తహసీల్దార్, ఎస్ఐ మండల కేంద్రంలో ఉన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి వెళ్లి నిల్వలను పరిశీలించారు. ధాన్యం బస్తాలను కేంద్రం నుంచి తరలించడానికి లారీలు రాకపోవడంతో కొనుగోలులో జాప్యం జరుగుతుందని నిర్వాహకులు వారి దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృత్తం కాకుండా రైతుల నుంచి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయాలని సింగిల్ విండో సిబ్బందికి సూచించారు.


