ములుగు: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్డీఓ సత్తయ్య, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
చిత్తడి నేలల పరిరక్షణకు చర్యలు
జిల్లాలోని చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలని కలెక్టర్, జిల్లా చిత్తడి నేలల కమిటీ చైర్మన్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ జిల్లా స్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చిత్తడి నేలల గుర్తింపు, సర్వే, హద్దుల నిర్ధారణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తడి నేలలు, జలవనరుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని జలవనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి విస్తీర్ణం, హద్దులకు సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే, హద్దుల నిర్ధారణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ సంపత్, డీపీఓ వెంకయ్య, డీఏఓ సురేశ్కుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవరావు పాల్గొన్నారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


