లబ్ధిదారుడికి పింఛన్ మంజూరు పత్రం
అందజేస్తున్న మంత్రి సీతక్క
మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు
శంకుస్థాపన చేస్తున్న మంత్రి సీతక్క
ఎస్ఎస్తాడ్వాయి/మంగపేట: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో రూ.4.46 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.83 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏటూరునాగారం మండలం శివాపూర్లో రూ.80లక్షలతో చేపట్టిన పనులను ప్రారంభించారు. గోగుపల్లిలో రూ.55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏటూరునాగారం మార్కెట్ యార్డులో రూ.2.28 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రహదారులు, మురుగు కాల్వలతో పాటు మార్కెట్ యార్డుల్లో అవసరమైన సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా మంగపేట మండలంలో బుధవారం సాయంత్రం మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీఓ భద్రునాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై వివిధ గ్రామాలకు చెందిన 43 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందచేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటీవల హేమాచల క్షేత్రం అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేయగా మరింత అభివృద్ధికి సీఎం ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అలాగే మామిడిగూడెంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నరసింహస్వామి, వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క


