ఆస్తికంటే చెల్లిపై ప్రేమ ఎక్కువ
కష్టమే రానివ్వనని ఒకరు. ఆపదొస్తే అండగా నిలుస్తానని మరొకరు. నీకు నేనున్నానంటూ ఇంకొకరు.. తోబుట్టువుకు సగం ఆస్తి రాసిచ్చిన అన్న ఒకరు. అక్కతో రాఖీ కట్టించుకోవడానికి విదేశాల నుంచి సొంతూరికి వచ్చిన తమ్ముడొకరు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. రాఖీ పండుగకు అసలైన అర్థం చెబుతున్న వీరందరి గురించి రక్షాబంధన్ సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.
కాశిబుగ్గ: కొత్తవాడకు చెందిన దువ్వ సాంబమూర్తి–రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా, ఒక కుమారుడు రాజ్కుమార్, కుమార్తె శీరిష ఉన్నారు. వికలాంగుడైన తండ్రి సాంబమూర్తి కుమార్తె పెళ్లి చేసిన తర్వాత మరణించాడు. చెల్లెలిపై ప్రేమతో అన్న రాజ్కుమార్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్) చెల్లి, బావకు కొత్తవాడలోని ఇంట్లోనే నివాసం కల్పించాడు. చెల్లెలిపై ప్రేమతో ఆరునెలల క్రితం పుర ప్రముఖుల సమక్షంలో 180 గజాల ఇల్లు స్థలంలో సగం 90 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసి, కాగితాలు అప్పగించాడు. చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న రాజ్కుమార్ను అందరూ అభినందిస్తున్నారు.
తండ్రి ప్రేమను పంచిన పలువురు అన్నలు
ఆస్తి కాదు.. అనుబంధమే ముఖ్యమంటున్న ఓ సోదరుడు అక్కాచెల్లెళ్లకు అండగా నిలుస్తున్న సోదరులు
రాఖీ కట్టి రక్షగా నిలుస్తామంటున్న సోదరీమణులు నేడు రాఖీ పౌర్ణమి


