ములుగు: సోదరభావానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఆదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులకు గురువారం మంత్రి సీతక్కకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీతక్కకు చీర బహుకరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సోదరసోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి సీతక్క రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలు నిర్వహించి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మంత్రి సీతక్క రాఖీలు కట్టారు.
బెటాలియన్ కమాండెంట్గా
లక్ష్మీకాంతరావు
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయిలో గల 5వ బెటాలియన్ (టీజీఎస్పీ) నూతన కమాండెంట్గా సీవీ.లక్ష్మీకాంతరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో విధులు నిర్వహించిన ఆయన అంకితభావం, క్రమశిక్షణతో విశిష్ట సేవలు అందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులు, సిబ్బందితో సమావేశమైన మాట్లాడారు. బెటాలియన్లో క్రమశిక్షణ, సమన్వయం, విఽధి నిర్వహణతో పాటు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బెటాలియన్ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. నూతన కమాండెంట్కు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో సహాయక కమాండెంట్లు పీకే ప్రసాద్, ధర్మారావు, ఆర్ఐలు కిరణ్ కుమార్, భాస్కర్, స్వామి, వెంకటేశ్వర్లు, సాయిబాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ పోటీలకు
బాచి ఎంపిక
ములుగు: మండల పరిధిలోని బండారుపల్లిలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థి గుడెల్లి బాచి జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. దక్షిణ జోనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు –2026 అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాచి 60 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి పతకం అందుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని పాఠశాల ప్రిన్సిపల్ సింగారం దేవకి తెలిపారు. ఈ మేరకు గురువారం అధ్యాపకులు బాచిని అభినందించారు.
హిందూ సంప్రదాయ దుస్తుల్లో జర్మనీ దేశస్తులు
వెంకటాపురం(ఎం): భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతూ జర్మనీ దేశానికి చెందిన సాండ్రో కోట్, స్టెపానీ ఎంజిల్మెన్ హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి రామప్ప దేవాలయాన్ని గురువారం సందర్శించారు. భారతీయ సంస్కృతిలో పురుషులు ధోతి, కుర్తా మహిళలు చీరవంటి సంప్రదాయ వస్త్రాలను ధరించడం ద్వారా మన ఆచార వ్యవహారాలకు గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో విదేశీయులు సైతం భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. టూరిజం గైడ్ విజయ్ కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించగా వారు రామప్ప శిల్పకళను ఆసక్తిగా తిలకించారు. రామప్ప ఆలయం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు.
రేషన్ షాపు తనిఖీ
మహాముత్తారం: మండల పరిధిలోని కొర్లకుంటలో గల రేషన్ షాపును గురువారం జిల్లా తూనికల కొలతల అధికారి శ్రీలత తనిఖీ చేశారు. దుకాణంలోని కాంటాను పరిశీలించారు. లబ్ధిదారులకు బియ్యం తూకం వేసేటప్పుడు తట్టు సంచిని ఉపయోగించి వేసినట్లు విచారణలో తేలిందన్నారు.


