ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించనున్న నేటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. నేడు జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలు కన్నాయిగూడెం మండలం దేవాదుల ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం రద్దుచేసినట్లు తెలి పారు. జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
ములుగు రూరల్: రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ సూచనల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయడం మేలని తెలిపారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. జిల్లాలో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదు అయిందని వెల్లడించారు. రైతులు అపరాల సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు.
భీమయ్యకు
బంగారు పతకం
ఏటూరునాగారం: 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్, అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్–2026లో మండల కేంద్రానికి చెందిన క్రీడాకారుడు భీమయ్య లాంగ్ జంప్లో బంగారు పతకం సాధించినట్లు కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. కొల్లూరులోని గౌడియం స్కూల్లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకం సాధించినట్లు వివరించారు.
108 అంబులెన్స్లో ప్రసవం
వాజేడు: మండల పరిధిలోని ములుకన పల్లి గ్రామ సమీపంలో 108 అంబులెన్స్లో తెల్లం మంజు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈఎంటి మానస, పైలెట్ దశరథ్ కథనం ప్రకారం.. ములుకనపల్లికి చెందిన తెల్లం మంజుకు ఆదివారం పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు అక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నొప్పులు ఎక్కువ కాగా ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారిని వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య శాలలో చేర్పించారు. ప్రస్తుతం తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈఎంటీ మానస, పైలెట్ ధశరథ్ను స్థానికులు కొనియాడారు.


