ములుగు రూరల్: నాయీ బ్రాహ్మణులు సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని సంఘం గౌరవ అధ్యక్షులు జంపాల రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాలయాలు, జాతరల్లో తలనీలాల సేకరణ హక్కులు పూర్తిగా నాయీబ్రాహ్మణులకే కేటాయించాలన్నారు. నాయీ బ్రాహ్మణులకు జీవనాధారమైన క్షౌ రవృత్తిని వారికి దూరం చేయాలని చూస్తున్నారని తెలిపారు. దేవాలయాలు, జాతరలలో వృత్తి నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులకు ఆదరణ లేక, వృత్తి ద్వారా వస్తున్న ఆదాయం దక్కకుండా పోతుందన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పేరుతో ఇతర కులాల వారు ఆదాయం కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు త్వరలో జరగనున్న జిల్లా మహాసభలకు ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జంపాల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా చెన్న కుమార్, కోశాధికారిగా వేల్పకొండ శరబంధంలను ఎన్నుకున్నారు.


