న్యూస్రీల్
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని, నాణ్యమైన విద్య ప్రమాణాలకు చిరునామగా ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తున్నాయని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యా కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహిస్తూ అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణమని తెలిపారు. డిజిటల్ లెర్నింగ్, విద్యార్థుల సంక్షేమం, సమాజ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజా ప్రతినిధులు గ్రామాలాభివృద్ధిలో భాగంగా లైబ్రరీల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న పనులపై పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పేర్లు నమోదు చేసుకోవాలి
జిల్లా కేంద్రంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాల్లో పాల్గొనేవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆసక్తి కలిగిన ప్రజలు, కళాకారులు, విద్యార్థులు, క్రీడాకారులు మే 18 వరకు ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి ధర్మనాయక్ సెల్ 7032153610, డీవైఎస్ఓ రామ్మోహన్ 7207503775 నంబర్లకు వాట్సాప్ ద్వారా వివరాలు పంపించి నమోదు చేసుకోవాలన్నారు. ఆఫ్లైన్లో ఈడీ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం, జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో 18వ తేదీ వరకు పేర్లను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
సత్యవతిరాథోడ్ ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు
పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ, వరంగల్,
హనుమకొండ జిల్లాల బాధ్యతలు
నేడు ప్రజాదర్బార్
ఏటూరునాగారం: నేడు కన్నాయిగూడెం మండల పరిధిలోని లక్ష్మిపురం, ముప్పనపల్లిలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మిపురంలో ఉదయం 8 గంటలకు, ముప్పనపల్లిలో 10 గంటలకు నిర్వహించే ప్రజాదర్బార్కు మంత్రి హాజరై పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు హాజరవుతారని వెల్లడించారు.
హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి
వెంకటాపురం(ఎం): గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్పీవీ వ్యాక్సిన్ను తప్పనిసరిగా 14ఏళ్లు నిండిన బాలికలకు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగ అన్వేష్ తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన బుధవారం పరిశీలించి మాట్లాడారు. హెచ్పీవీ వ్యాక్సిన్తో దుష్ఫలితాలు ఉండవని, టీకాపై ఉన్న అపోహలను నమ్మొద్దని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 800 మంది బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆనంతరం పోషకాహార ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించి గర్భాశయ క్యాన్సర్ నివారణకు ముందడుగు వేయాలని కోరారు. తిమ్మాపూర్, కేశవాపూర్, నల్లగుంట, వెంకటేశ్వర్లపల్లె గ్రామాల నుంచి వచ్చిన 21 మంది బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ శ్రీనివాస్, సంపత్, ఫార్మసీ ఆఫీసర్ రాజమణి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
హేమాచల క్షేత్రంలో
హనుమాన్ భక్తులు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. వారితో పాటు ఆంజనేయస్వామి మాలధారణ దీక్ష ముగిసిన అంజన్న భక్తులు భద్రాచలంలో ఇరుముడి అప్పగించి భద్రాది సీతారామచంద్రస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసింది. ఆలయనికి వచ్చిన భక్తులకు అర్చకులు భక్తు ల గోత్రనామాలతో అర్చనలు జరిపించి స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని వివరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
సాంస్కృతిక ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
ములుగు: సాంస్కృతిక వైభవం ఉత్సవాల ఏర్పాట్లను బుధవారం అదనపు కలెక్టర్ సంపత్ రావు పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే వారికి తగిన వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీపీఓ వెంకయ్య, తహసీల్దార్ విజయభాస్కర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


