ఆ తర్వాత బీఫామ్ కోసం ప్రయత్నాలు
మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్న ఆశావహులు
అభ్యర్థుల ఎంపికపై పార్టీల్లో కసరత్తు
ఉపసంహరణ నాటికి బీ ఫామ్ ఇస్తేనే పార్టీ అభ్యర్థి
ములుగు: మున్సిపల్ నగారా మోగడంతో పోటీకి సై అంటున్న ఆశావహుల్లో సందడి నెలకొంది. అధికారికంగా ఏ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకున్నా.. తొలుత నామినేషన్ వేసి ఆపై బీఫామ్ కోసం ప్రయత్నం చేద్దామనే భావనతో పలువురు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలుకు మూ డు రోజుల సమయమే ఇవ్వడంతో అందుకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
బలమైన వారికే..
నామినేషన్ వేసినా పార్టీ నుంచి బీ ఫామ్ అందితేనే ఆ పార్టీ గుర్తు దక్కుతుంది. దీంతో తొలుత నామినేషన్ వేయడానికి ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఏ వార్డుల్లో ఎవరు పార్టీ అభ్యర్థి అనేది నామినేషన్ల ఉపసంహరణతోనే తేలనుంది. దీంతో తొలుత నామినేషన్ వేద్దాం.. ఆపై చివరి వరకు బీ ఫామ్ కో సం ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలో పలువురు ఉన్నారు. ఇప్పటికే వార్డుల వారీగా బలమైన అభ్యర్థులు ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించినట్లు తెలిసింది. ఈ సర్వేల ప్రకారమే అంగ, ఆర్థిక, జనబలం ఉన్న వారికి బీ ఫామ్ ఇవ్వనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో బలం ఉందనుకునే వారినే బరిలోకి దింపేలా సిద్ధమవుతోంది. బలం లేని చోట పొత్తు కలిసొచ్చే పార్టీలకు సీట్లు కేటాయించేలా చర్చలు చేస్తోంది.
కలిసొస్తే ప్రచారం..
షెడ్యూల్ విడుదలైన తెల్లారి నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలుకావడంతో అభ్యర్థులను ఎంపిక కోసం పార్టీలకు సమయం లేనట్లే. అంతే కాక మూడు రోజులే నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటిరోజే పార్టీ బీ ఫామ్తో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు 12 రోజుల పాటు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అందుకే పార్టీలు కూడా అభ్యర్థులను త్వరగా నిర్ణయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇదేసమయాన టికెట్ రాని ఆశావహులకు నచ్చజెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
అంతా వారం లోగానే..
ఈ నెల 28(బుధవారం) నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆ తర్వాత పరిశీలన, అభ్యంతరాలు, ఉపసంహరణల ప్రక్రియ ఉంటుంది. వచ్చే నెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అప్పటి వరకు బీ ఫామ్ ఇచ్చే అవకాశం ఉన్నందున పార్టీలు తేల్చేవరకు అభ్యర్థి ఎవరో వేచి చూడక తప్పదు. మొత్తంగా వారం లోపలే ప్రక్రియ ముగియనుండడంతో పార్టీలకు సవాల్గా మారనుంది. ఆశావహులు ఎక్కువ మంది నామినేషన్ వేస్తే.. వీరిలో పార్టీ అభ్యర్థిని తేల్చడం, మిగతా వారిని బుజ్జగించి ఉపసంహరింపజేయడం కత్తిమీద సాములా మారే అవకాశం ఉంది.
తొలిరోజు నాలుగు నామినేషన్లు
ములుగు మున్సిపాలిటీకి తొలిరోజు 4 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 20 వార్డులు ఉండగా ఏడు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మూడు వార్డులను కలిపి ఒక నామినేషన్ కేంద్రం చొప్పున, 18 వార్డులకు 6 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరో రెండు వార్డులకు ఒక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8,9,16,19 వార్డులకు ఒకటి చొప్పున నామినేషన్ దాఖలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.


