రెండేళ్లకొకసారి.. లక్షలాదిమంది భక్తులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మేడారం మహాజాతరలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. సమక్క నేడు వనం నుండి జనం మధ్యకు రానుంది. తల్లి రాక సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి.
మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే గడియలు వచ్చేశాయి. నిన్న రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయ్యింది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి కన్నేపల్లి నుంచి సారలమ్మ ను, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజు ప్రతిరూపాలను కాలి నగడకన తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మంత్రి సీతక్క, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ సారలమ్మకు స్వాగతం పలికారు.
ఇక ఈ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది.. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడినుండి గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. సారలమ్మను కాక వంశీయుల చేతుల మీదుగా తీసుకురాగా.. సమ్మక్కను సిద్దబోయిన వంశీయుల చేతుల మీదుగా గద్దెల పైకి తీసుకొస్తారని తెలిసిందే. ఈ కార్యక్రమంలో చందా వంశీయులు, ఐదు వంశస్తులు, మేడారం గ్రామస్తులతో పాటు ఆదివాసీలు అంతా పాల్గొని డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సంప్రదాయాలతో సమ్మక్కను ఉత్సాహంగా, ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు..
సమ్మక్క రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంచనాలతో స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ. జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా డిప్యుటీ సీఎం భట్టి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పూజారులకు స్వాగతం పలుకుతారు..
సమ్మక్క ఆగమనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రి సీతక్క అన్నీ తానై జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ సమ్మక్కను గద్దెల పైకి తీసుకు రావడం కోసం మూడంచెల పోలీసు భద్రతతో ప్రత్యేక రోప్ పార్టీని సిద్ధం చేశారు. ఇప్పటికే రెండుసార్లు మాక్ డ్రిల్ నిర్వహించారు.

ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే మేడారం పరిసరాలన్ని జనంతో కిక్కిరిసిపోయాయి. చుట్టూ పది కిలోమీటర్ల నిడివితో ఎటు చూసినా మేడారం వనం మొత్తం జనసంద్రంగా మారిపోయింది. వివిధ మార్గాల్లో మేడారం చేరుకున్న భక్తులంతా సమ్మక్క ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు.. సమ్మక్క - సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు దీరిన తర్వాత మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం అవుతారు.


