ఒకప్పుడు సినిమా చివర్లో పార్ట్-2 త్వరలో అనే టైటిల్ కార్డు పడితే, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్కు బ్రేక్ పడుతున్నట్టుంది. కొన్ని సినిమాలకు రెండో భాగం ప్రకటించినా, ఆ స్థాయిలో వర్కవుట్ కాలేదు. తల బొప్పికట్టే రేంజ్లో కొన్ని సినిమాలు చుక్కలుచూపించడంలో పార్ట్-2 అనేది దండగ అనే ఫీలింగ్కు వచ్చారు మేకర్స్. కథ డిమాండ్ లేకుండా సీక్వెల్స్ తీయడం అనవసరమని నిర్మాతలు భావిస్తున్నారు. బడ్జెట్ పెంచడం లేదా హైప్ క్రియేట్ చేయడం కోసం పార్ట్-2లు తీయడం సరైన పద్ధతి కాదని స్పష్టంగా చెబుతున్నారు.
అసలు సీక్వెల్ ట్రెండ్ను మొదలుపెట్టిన రాజమౌళి కూడా ఇప్పుడు దానికి దూరమయ్యాడు. తను మహేష్బాబుతో చేస్తున్న తాజా చిత్రం “వారణాసి” ఒక్క భాగమే అని స్పష్టం చేశాడు. అంతేకాక సినిమా చివర్లో పార్ట్-2 కార్డులు పడవని ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర యూనిట్ కూడా సీక్వెల్ ఉండదని ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, జూ.ఎన్టీఆర్తో చేస్తున్న “డ్రాగన్” సినిమాను సింగిల్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఇప్పుడు వచ్చే ఏ సినిమాకైనా పార్ట్-2 ఉందని ప్రకటిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్ట్-2 ఉంది అనగానే దానికి వచ్చే హైప్ కంటే ట్రోలింగ్నే ఎక్కువగా జరుగుతోంది. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు కూడా ఒక్క భాగంలోనే కథను ముగించాలనే నిర్ణయానికి వస్తున్నాయి. చూస్తుంటే రానున్న కాలంలో వచ్చే చిత్రాలకు ఈ పార్ట్-2 గోల తగ్గేలానే కనిపిస్తోంది.


