‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఒక మంచి సినిమా అనే ముద్ర కుటుంబ ప్రేక్షకుల్లో ఉంది. నిర్మాతగా మంచి చిత్రం తీశాననే సంతృప్తిని నాకు మిగిల్చింది. నేటి నుంచి మా సినిమాని ‘ఆహా’లో చూస్తారని ఆశిస్తున్నాను’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. సాయి తేజ్ హీరోగా, వేద జలంధర్ హీరోయిన్గా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మించారు.
తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదలైంది. ఈ మూవీ నేటి నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గురువారం నిర్వహించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ సంబరాలు’ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ–‘‘నేను హీరోగా చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్ పూర్తయింది. ‘గువ్వల చెరువు ఘాట్’ షూటింగ్ చివరి దశలో ఉంది’’ అన్నారు. ‘‘థియేటర్స్లో మా సినిమాను ఆదరించారు. ఓటీటీలో కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని వి. మునిరాజు పేర్కొన్నారు.


