‘‘విష్ణు విన్యాసం’ చిత్రంలో నేను చేసిన విష్ణుపాత్ర ఎగ్జయిటింగ్గా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు కొత్త. విష్ణు చాలా నమ్మకాల్ని ఫాలో అవుతుంటాడు. ఈపాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. మా సినిమాని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ప్రేక్షకులు రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు. ఈ వీకెండ్కి థియేటర్కి వెళ్లి, హ్యాపీగా టైమ్పాస్ చేసి రావొచ్చు’’ అని హీరో శ్రీ విష్ణు చెప్పారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. హేమ, షాలిని సమర్పణలో సుమంత్ నాయుడు .జి నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం శ్రీ విష్ణు విలేకరులతో పంచుకున్న విశేషాలు...
⇒ యదునాథ్ మారుతి ‘విష్ణు విన్యాసం’ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ కొత్తయినప్పటికీ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఈ చిత్రంలో నేను లెక్చరర్గా కనిపిస్తాను. నా సహ లెక్చరర్గా సత్య కనిపిస్తాడు. మా మధ్య సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. ఇందులో వీరి వీరి గుమ్మడి పండు అనే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ ఎపిసోడ్కి థియేటర్ మొత్తం నవ్వులతో బ్లాస్ట్ అవుతుంది. ఈ మూవీలో నేను చేసిన విష్ణు క్యారెక్టర్కి కొన్ని రూల్స్ ఉంటాయి. చాలా నమ్మకాలని ఫాలో అవుతుంటాడు. వ్యక్తిగతంగా నేను జాతకాలను, గ్రహాలను పూర్తి స్థాయిలో ఫాలో కాను. కానీ, చిన్నప్పటి నుంచి అందరితోపాటు అలవాటు చేసుకున్న కొన్నింటిని మాత్రం ఫాలో అవుతాను.
⇒ నయన్ సారికపాత్రని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. రెండు మూడు పేజీల సీన్ని తను సింగిల్ టేక్లో చేసింది. రథన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేపథ్య సంగీతం సురేష్ బొబ్బిలిగారితో చేయించాం. అది కూడా అద్భుతంగా వచ్చింది. నా సినిమాలన్నీ ఓటీటీ డీల్స్ పూర్తవడం... నిర్మాతలు హ్యాపీగా ఉండడం చాలా ఆనందాన్నిస్తోంది. నిర్మాతలు పెట్టే డబ్బులు వెనక్కి వస్తే చాలనుకుంటాను. ఈ చిత్ర నిర్మాతలు సుబ్రమణ్యం, సుమంత్గార్లు ఔట్పుట్ విషయంలో హ్యాపీగా ఉన్నారు. మేం అనుకున్న బడ్జెట్లో ఓ పదిహేను శాతం తక్కువలోనే సినిమాని పూర్తి చేశాం.
⇒ కామెడీ చేయడం, నవ్వించడం కష్టం. అయితే దాదాపు సిచ్యువేషనల్ కామెడీస్ చేస్తున్నాం కాబట్టి వర్కౌట్ అవుతున్నాయి. నేను చేసేవన్నీ దాదాపు మన చుట్టూ ఉండే కథలే... మనకు తెలిసినపాత్రలే. మిడిల్ క్లాస్ స్టోరీ సెటప్. ఇలాంటి సినిమాలను 60, 70 రోజుల్లో చేసుకోవచ్చు. అందుకే నా సినిమాలు ఫాస్ట్గా అవుతున్నాయని భావిస్తున్నా. నేను నటించిన ‘మృత్యుంజయ్’ మార్చి 6న రిలీజ్ కానుంది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ 80 శాతం పూర్తయింది. రామ్ అబ్బరాజుతో చేయనున్న సినిమా త్వరలో స్టార్ట్ కానుంది. సితార బ్యానర్లో సన్నీ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా ఉంది.


