సాయి పల్లవి తొలిసారి నటించిన బాలీవుడ్ మూవీ ‘ఏక్ దిన్’ మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ హీరోగా నటించిన ఈ చిత్రానికి తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాలో తన పాత్రకు తగిన న్యాయం చేయలేదని సాయి పల్లవి ముందే చెప్పేసిందట. అంతేకాదు ఈ సినిమా ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో కూడా ఓ ఇంటర్వ్యూలో వివరించింది.
‘ఏక్ దిన్ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. చిత్రబృందం నాకు స్టోరి చెప్పేందుకు వచ్చినసమయంలో నేను చాలా ఎమోషనల్ సినిమాల్లో నటిస్తున్నాను. దాని వల్ల నేను ఒత్తిడిగి గురయ్యాను. అందుకే మనసుకు హాయిగా అనిపించే పాత్ర చేయాలనుకున్నాను. అప్పుడే ఏక్ దిన్ కథ నా దగ్గరకు వచ్చింది. వినగానే హాలీవుడ్ క్లాసిక్ ‘బిఫోర్ సన్రైజ్’ మూవీ గుర్తుకు వచ్చింది. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను.
ప్రీమియర్స్ షో చూసిన తర్వాత నా నటన నచ్చలేదు. ఆ పాత్రకు నేను న్యాయం చేయలేకపోయాను అనిపించింది. ఇదే విషయాన్ని ఆమిర్ ఖాన్తో చెప్పా. ‘ఈ పాత్రకు నన్ను కాకుండా మరొకరిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదేమో. చురుగ్గా, హుషారుగా ఉండే కొత్త అమ్మాయిని ఎంపిక చేసి ఉండాల్సింది. వాళ్లు ఈ పాత్రకు బాగా న్యాయం చేసేవాళ్లు’ అని ఆయనతో చెపా’ అని సాయి పల్లవి అన్నారు. పక్కనే ఉన్న జునైద్ మాత్రం..ఈ పాత్రకు సాయి పల్లవి సరైన ఎంపిక అని, అద్భుతంగా నటించిందని చెప్పారు.


