OTT: ఓటీటీని షేక్‌ చేయనున్న సినిమాలివే!

OTT: Five Movies Releasing On OTT Platforms On May 14 - Sakshi

శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోయేవి. జనాలు కూడా కొత్త చిత్రాలు ఏమేం రిలీజ్‌ అవుతున్నాయా? అని ఈ రోజు కోసం తెగ ఎదురుచూసేవాళ్లేవారు. కానీ కరోనా పుణ్యమా అని అన్ని రోజులూ ఆదివారాలే అయిపోయాయి. థియేటర్లకు కూడా హాలీడేస్‌ వచ్చేశాయి. కానీ ప్రేక్షకుడికి అందించే వినోదానికి మాత్రం బ్రేక్‌ రాలేదు. సినిమాలు కాకపోతే వెబ్‌ సిరీస్‌లు, థియేటర్లు కాకపోతే ఓటీటీలు.. ఇలా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు కొత్త దారుల్లో పయనిస్తోంది చిత్ర పరిశ్రమ. ఈ క్రమంలో నేడు(మే 14) ఐదు సినిమాలు ఓటీటీని షేక్‌ చేసేందుకు రెడీ అయ్యాయి. అవేంటో చదివేయండి..

విజయ్‌ సేతుపతి

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విజయ్‌ సేతుపతి. తెలుగులో విలన్‌, సహాయక పాత్రల్లో మాత్రమే కనిపించిన సేతుపతి ఇందులో హీరోగా సందడి చేయనున్నాడు. విజయ్‌ చందర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లు. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో నేటి నుంచి ప్రసారం కానుంది.

కర్ణన్‌

తమిళ హీరో ధనుష్‌ నటించిన కర్ణన్‌ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో నేటి నుంచి ప్రసారం కానుంది. ఏప్రిల్‌ 9న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్‌ దగ్గర కాసులు కురిపించిన ఈ సినిమా ఓటీటీని ఎలా షేక్‌ చేస్తుందో చూడాలి.

సినిమా బండి

ప్రవీణ్‌ కండ్రిగుల దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సినిమా బండి. ఇటీవల రిలీజైన ట్రైలర్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేయగా నేటి నుంచి ప్రసారం చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

చెక్‌

యంగ్‌ హీరో నితిన్‌ ఖైదీగా, ప్రియా వారియర్‌ అతడి ప్రేయసిగా నటించిన చిత్రం చెక్‌. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లాయర్‌గా కనిపించింది. చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఓటీటీ బాట పట్టిన ఈ మూవీ నేటి నుంచి సన్‌ నెక్స్ట్‌ యాప్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

బట్టల రామస్వామి బయోపిక్కు

అల్తాఫ్‌ హాసన్‌, శాంతి రావు, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బట్టల రామస్వామి బయెపిక్కు. రామ్‌ నారాయణ్‌ డైరెక్షన్‌ చేయగా సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌, ఐ మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా జీ 5లో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. 

ఇక రామ్‌గోపాల్‌ వర్మ డీ కంపెనీ సినిమా కూడా ఓటీటీలో వస్తోంది. వ్యాపారవేత్త సాగర్‌ మచనూరు ఆరంభించిన స్పార్క్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మే 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇక రాధే సినిమా నిన్నటి నుంచే జీ 5లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top