
'తండ్రి ఎంత సంపాదించాడన్నది నాకు ముఖ్యం కాదు. నా కష్టార్జితంతోనే నేను ముందుకు సాగుతాను' అంటున్నాడు మలయాళ నటుడు మాధవ్ సురేశ్. కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి కుమారుడే మాధవ్. ఇటీవల ఇతడు లగ్జరీ బ్రాండ్ గోల్ఫ్ జీటీఐ కారు కొనుగోలు చేశాడు. తండ్రి సంపాదనతోనే ఇంత పెద్ద కారు కొన్నాడని పలువురు కామెంట్లు చేశారు. తాజాగా ఈ కామెంట్లపై మాధవ్ స్పందించాడు.
నాన్న కొనివ్వలేదు..
ఓ ఇంటర్వ్యూలో మాధవ్ సురేశ్ (Madhav Suresh) మాట్లాడుతూ.. ఇటీవల నేను గోల్ఫ్ జీటీఐ కారు కొన్నాను. కేరళలో దీని ధర రూ.67 లక్షలు. మిగతా రాష్ట్రాల్లో అయితే దీని ఖరీదు ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే కారు తెచ్చుకోగానే చాలామంది మా నాన్నే కొనిచ్చాడని నన్ను తీసిపడేశారు. మీ అందరికీ ఓవిషయం చెప్తున్నా.. అది లోన్ తీసుకుని కొన్నాను. ప్రతి నెల కారు ఈఎమ్ఐ నేనే కట్టుకుంటాను. నా సంపాదనతోనే లోన్ చెల్లిస్తాను. మా నాన్న సంపాదించిందంతా ఆయన రిటైర్ అయ్యాక విశ్రాంత జీవితం గడిపేందుకు ఉపయోగపడుతుంది. లేదంటే నా సోదరీమణుల పెళ్లికి ఖర్చు చేస్తాడు. ఆయన డబ్బు వాటికోసం మాత్రమే ఉపయోగించాలి.
ట్రోల్స్.. లైట్ తీసుకుంటా
ఒకవేళ నేను సంపాదించలేకపోతే అప్పుడు ఆయన సాయం తీసుకుంటాను. కానీ నేను కొన్న కారు మా నాన్న ఇచ్చిందైతే కాదు. నేను నా కోసం, నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. ఇక నన్ను తిట్టేవాళ్లపై నాకేమాత్రం కోపం లేదు. ఎందుకంటే నాకోసం వారు సమయం కేటాయిస్తున్నారు. అలా అని వారి ట్రోలింగ్కు స్పందిస్తూ కూర్చోను. నాకు గౌరవం ఇచ్చేవారినే తిరిగి గౌరవిస్తాను. నాన్న బీజేపీ మంత్రి అవడం వల్ల చాలామంది ఆయన్ని, మా కుటుంబం మొత్తాన్ని ద్వేషిస్తూ ఉంటారు. వాటిని నేను లెక్క చేయను అని మాధవ్ సురేశ్ చెప్పుకొచ్చాడు.
సినిమా..
మాధవ్ ప్రస్తుతం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ చేశాడు. ఇందులో సురేశ్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ టైటిల్పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవి మరో పేరైన జానకిని.. సినిమాలో దాడికి గురైన మహిళకు పెట్టడం సమంసజం కాదని అభిప్రాయపడింది. ఈ విషయంపై నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్ 27న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది.
చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్