Kamal Haasan: ఇకపై ప్రజల కోసం పెట్టుబడి పెడతాను: కమల్ హాసన్
చెన్నై సినిమా: ఇకపై ప్రజల కోసం పెట్టుబడి పెడతానని నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తెలిపారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'విక్రమ్'. రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ మూవీ. విజయ్సేతుపతి ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం జూన్ 3వ తేదీన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా బుధవారం (మే 25) సాయంత్రం కమలహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ మీడియాతో ముచ్చటించారు. తన గత చిత్రం విడుదలై నాలుగేళ్లు అయిందని అందుకు అభిమానులకు క్షమాపణ చెబుతున్నట్లు కమలహాసన్ పేర్కొన్నారు. తాను సంపాదించింది తిరిగి చిత్ర పరిశ్రమలోనే పెడుతున్నానని, ఇకపై ప్రజల కోసం కూడా పెట్టుబడి పెడుతానని చెప్పారు. కరుణానిధి జయంతి అయిన 3వ తేదీన విక్రమ్ చిత్రాన్ని విడుదల చేయడమన్నది యాదృచ్ఛికమే అన్నారు. అయితే ఆయన తనకు ఇష్టమైన నాయకుడని పేర్కొన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్ర మ్-3 చేయడానికి తాను సిద్ధమని తెలిపారు. కాగా పీఆర్ఓగా 600 చిత్రాలను పూర్తి చేసిన డైమండ్ బాబును కమలహాసన్ ఘనంగా సత్కరించారు.