గతేడాది డిసెంబరులో జానీ మాస్టర్ భార్య సుమలత.. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. వచ్చే ఏడాది డిసెంబరు వరకు పదవీకాలం ఉంది. కానీ అసోసియేషన్లో గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్న సంఘటనల కారణంగా ఈమెని తప్పించారు. ఆదివారం.. హైదరాబాద్లోని కృష్ణానగర్లో యూనియన్ డ్యాన్సర్స్ భేటీ అయ్యారు. ఈ మేరకు కార్యవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులని ప్రకటించారు.
డ్యాన్సర్స్ అసోసియేషన్కి రఘు మాస్టర్ ప్రెసిడెంట్ కాగా మెహర్ బాబా మాస్టర్ సెక్రటరీ, బసవరాజు వైస్ ప్రెసిడెంట్, రాజన్న జాయింట్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. కార్యవర్గ సభ్యులుగా సతీష్, నాగార్జున, శివ కృష్ణ , జోజో ఉండనున్నారు. అయితే వీళ్లంతా తాత్కాలిక సభ్యులే. త్వరలో ఎన్నికలు జరుగుతాయని రఘు మాస్టర్ చెప్పారు.
యూనియన్ డాన్సర్స్ భేటీలో మాట్లాడిన రఘు మాస్టర్.. 1997 నుంచి ఈ అసోసియేషన్లో నేను ఉన్నాను. దాసరి లాంటి పెద్దవాళ్లు అందరూ కలసి ఒక్కొక్క క్రాప్ట్ని ఏర్పాటు చేసి పరిశ్రమని అభివృద్ధి చేశారు. ప్రతి అసోసియేషన్లో ప్రత్యర్థులు ఉంటారు. ఫెడరేషన్ సహాయ సహకారాలు లేవు అన్నప్పుడు ప్రెసిడెంట్ నుంచి సమాధానం కోసం డాన్సర్స్ ఎదురుచూశారు. ఇది మాస్టర్స్ ప్రాబ్లం కాదు డాన్సర్స్ ప్రాబ్లం. 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషనే హెడ్. డాన్సర్స్కి వేతనాలు గురించి మాట్లాడాలి అంటే ఫెడరేషన్ ద్వారానే నిర్మాతలను సంప్రదించాలి. సెక్యూరిటీ ఉంటుందనే అందరూ డాన్సర్స్, అసోసియేషన్లో చేరారు.
ఫెడరేషన్ గుర్తించాలి అనేది మన తపన. ఏ ఇండస్ట్రీలో కూడా ఫెడరేషన్ సహాయ నిరాకరణ లేదు. కానీ తొలిసారి ఇక్కడా పరిస్థితి వచ్చింది. మన అసోసియేషన్కి అందరి అండ కావాలి. మాస్టర్స్ అందరి సపోర్ట్ కూడా అసోసియేషన్కి ఉంటుంది. మనం అందరం ఫెడరేషన్లోకి వెళ్లిన తర్వాత మళ్లీ ఎన్నికలు పెట్టుకుందాం. అప్పుడు సుమలత కూడా పోటీ చేయొచ్చు. ఇక్కడ గొడవలు ఏమీ లేవు అందరికీ ఒక్కటే రూల్.
మినిట్స్ బుక్లో డాన్సర్స్ అందరూ సంతకాలు చేసి ఇస్తే అవి ఫెడరేషన్కి ఇచ్చి వెంటనే ఎన్నికలకు వెళ్దాం. ఫెడరేషన్ అండతో అసోసియేషన్ ఎన్నికలు జరగాలి. ఇక నుంచి పదవి వ్యామోహంతో అడ్డగోలుగా ప్రెసిడెంట్ వ్యవహరిస్తే డాన్సర్స్ అందరూ అసోసియేషన్ ఆఫీస్కు వెళ్లి గల్లాపట్టుకొని బయటకు వెళ్లగొట్టండి. ఆ హక్కు డాన్సర్స్ అందరికీ ఉంది అని చెప్పుకొచ్చాడు.


