ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయిన తెలుగు సినిమాలివే!

Drishyam-2 And Other Two Telugu Films On Course For OTT Release? - Sakshi

గతేడాది కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్‌ నుంచి ఈ ఏడాది మొదట్లో కాస్త కోలుకుంటున్నట్లు అనుకునేలోపే మళ్లీ సెకండ్‌ వేవ్‌ విజృంభించింది. దీంతో రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించిన చాలా సినిమాలు వెనక్కి తగ్గాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని సందిగ్ధత ఏర్పడింది. దీంతో నిర్మాతలు కూడా ఇప్పుడు ఓటీటీకే జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు సైతం త్వరలోనే ఓటీటీలో రిలీజ్‌ కానున్నట్లు సమాచారం. అవేంటో చూసేద్దాం..

వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన మలయాళ రీమేక్ సినిమా దృశ్యం 2 షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మాతృకను డైరెక్ట్‌ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు కూడా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమాను  అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందే ఈ సినిమాను ఓటీటీలో చేయాలని భావించినా నిర్మాత సురేశ్‌ బాబు వాటిని ఖండించారు. అయితే తాజాగా సినిమాల విడుదలకు ఆలస్యం అవుతుండటంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఓటీటీ ద్వారా 'దృశ్యం 2' సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్‌ అభిప్రాయపడుతున్నారట. ఈ విషయంలో వెంకటేష్‌ కూడా సముఖత వ్యక్తం చేశారని, 'దృశ్యం 2'ను ఓటీటీలో రిలీజ్‌ చేస్తే బాగుంటుందని చెప్పినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. 

నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ ‘అంధాదున్‌’కి రీమేక్‌ ఇది. నటా నటేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోండగా తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను జూన్‌ 11న విడుదల చేయాలని బావించినా కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని బావిస్తున్నారట. ఇందుకు సంబంధించి నిర్మాతలు ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థతో డీల్‌ మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

ఇక యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం `పాగల్`‌.నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక జూన్‌లో ఈ మూవీని థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలని భావించినా ప్రస్తుతం అందుకు తగ్గ పరిస్థితులు లేవు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. దీంతో ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌తో డీల్‌ మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

చదవండి : ప్రియాంకకు షారుఖ్‌ కిస్‌: విడాకులిస్తానని భార్య బెదిరింపులు!
Prabhas-Nag Ashwin Movie: రెమ్యునరేషనే రూ.200 కోట్లట!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top